చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!

  • విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన
  • సీఎం చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తి
  • ఫోన్ ఫీచర్ల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి
  • చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అని కొనియాడిన వైష్ణవ్
  • విశాఖ త్వరలో ఐటీపట్నం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడలో జరిగిన గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఓ ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, సభా వేదికపై చంద్రబాబు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌పై కేంద్రమంత్రి దృష్టి పడింది. వెంటనే ఆయన ఆ ఫోన్‌ను తీసుకుని ఆసక్తిగా పరిశీలించడం అందరినీ ఆకర్షించింది.

చంద్రబాబు వాడుతున్న కొత్త ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను చేతిలోకి తీసుకున్న అశ్వినీ వైష్ణవ్, దాని పనితీరు, ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు. అది ఏ మోడల్, అందులో ఉన్న ఫీచర్లు ఏమిటని క్షుణ్ణంగా ఆరా తీశారు. చంద్రబాబు కూడా ఓపిగ్గా తన ఫోన్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. ఉన్నతస్థాయి నేతల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి వాడుతున్న ఆ ఫోన్ ఏ కంపెనీకి చెందింది, దాని ధర ఎంత అనేదానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చంద్రబాబుపై అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు
ఈ ఘటనతో పాటు ఇదే సభలో సీఎం చంద్రబాబుపై అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబును దేశం గర్వించదగ్గ విజనరీ లీడర్ అని అభివర్ణించారు. గతంలో ఆయన హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మించి ఐటీ అభివృద్ధికి ఎలా బాటలు వేశారో గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో విశాఖపట్నం కూడా ఓ ‘ఐటీపట్నం’గా అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల దార్శనికతకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఇప్పటికే భారీగా నిధులు కేటాయించామని తెలిపారు.

Ashwini Vaishnaw
CM Chandrababu
Mobile Details
Phone Features
Vizag
Google Could Data AI Hub

More Telugu News